యూపీఐ వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్! నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2025 ఆగస్టు 1 నుంచి కొత్త నియమాలను అమలు చేయనుంది.

యూపీఐ వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్! నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2025 ఆగస్టు 1 నుంచి కొత్త నియమాలను అమలు చేయనుంది. ఈ నియమాలు యూపీఐ సిస్టమ్ను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మార్చడం, సిస్టమ్ ఒత్తిడిని తగ్గించి అంతరాయాలను నివారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మార్పులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల లాంటి PhonePe, Paytm, Google Pay వంటి యాప్లపై ప్రభావం చూపనున్నాయి. ఈ కొత్త నియమాల వల్ల వినియోగదారుల రోజువారీ లావాదేవీలలో కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఒక్కో వినియోగదారుడు ఒక్కో యాప్లో రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగలరు. ఉదాహరణకు, మీరు PhonePe, Paytm రెండూ ఉపయోగిస్తే, ప్రతి యాప్లో 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. మీ మొబైల్ నంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ల జాబితాను చెక్ చేయడం రోజుకు 25 సార్లకు పరిమితం. ఆటోపే అంటే Netflix సబ్స్క్రిప్షన్, SIP పెట్టుబడుల లావాదేవీలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కాకుండా నాన్-పీక్ అవర్స్లో మాత్రమే జరుగుతాయి. ప్రతి ఆటోపే మాండేట్కు ఒక్క అటెంప్ట్తో పాటు గరిష్టంగా 3 రీట్రైల్స్ అనుమతించబడతాయి. లావాదేవీ ధృవీకరణ తర్వాత కనీసం 90 సెకన్లు వేచి ఉండి మాత్రమే ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేయాలి. ఒక లావాదేవీకి 2 గంటల వ్యవధిలో గరిష్టంగా 3 స్టేటస్ చెక్లు మాత్రమే అనుమతించబడతాయి.
యూపీఐ నెట్వర్క్పై ఒత్తిడిని తగ్గించడం ద్వారా సిస్టమ్ డౌన్టైమ్, అంతరాయాలను నివారించడం దీని ముఖ్య ఉద్దేశం. అనవసరమైన API కాల్స్ను తగ్గించడం ద్వారా సిస్టమ్ భద్రతను పెంచడం. లావాదేవీల వేగం, నమ్మకాన్ని మెరుగుపరచడం దీని ఉద్దేశం. 2025 ఆగస్టు 31 నాటికి PSPలు NPCIకి ఒక లిఖిత హామీ సమర్పించాలి, సిస్టమ్-ఇనీషియేటెడ్ APIలను క్యూ చేసి, రేట్-లిమిట్ చేస్తున్నట్లు నిర్ధారించాలి. ఆడిటర్ల ద్వారా బ్యాంకులు ప్రతి సంవత్సరం సిస్టమ్ ఆడిట్ చేయించాలి, మొదటి ఆడిట్ రిపోర్ట్ 2025 ఆగస్టు 31 నాటికి సమర్పించాలి. బ్యాంక్తో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్గా, అప్డేట్గా ఉందని నిర్ధారించుకోవాలి. ఇప్పటికే 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన నియమాల ప్రకారం, పని చేయని మొబైల్ నంబర్లతో లింక్ అయిన యూపీఐ ఐడీలు డీఆక్టివేట్ అవుతాయి.
