India is shocked: ఒక్క సారిగా ఉలిక్కి పడ్డ భారత్..! ఆన్లైన్ గేమింగ్ టాస్క్.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!

భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పిల్లల దండ్రులు ఈ ఘటన చూసి షాక్ తిన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన ఈ ఘటన చూసిన వారందరినీ ఆందోళనకు గురిచేసింది. 16 ఏళ్లలోపు ఉన్న ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఓ పెద్ద అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకడంతో క్షణాల్లో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఓ గేమింగ్ యాప్ ఇచ్చి టాస్క్వల్లే వాళ్లు ఈ సాహసం చేశారని నిర్ధారణ అయింది.
నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) ముగ్గురు అక్కాచెల్లెలు. ఘజియాబాద్ జిల్లాలోని భారత్ సిటీ సొసైటీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఫిబ్రవరి 4 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్ లైన్ గేమ్కు బానిసలయ్యే ముగ్గురు అక్కాచెల్లెలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా గుర్తించారు. కోవిడ్ సందర్భంగా, లాక్డౌన్ ఉండడంతో ఈ ముగ్గురు ఆన్లైన్ వీడియో గేమ్కు బానిసలయ్యారు. 'కొరియన్ లవ్ గేమ్' అనే గేమ్ టాస్క్లో భాగంగా ముగ్గురు అక్కాచెల్లెలు బుధవారం తెల్లవారుజూమున ఒకేసారి బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు అక్కాచెల్లెలు ఆన్ లైన్ గేమ్ బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


