T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. జరగబోయే పరిణామాలివే..!
T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. జరగబోయే పరిణామాలివే..!

భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను పాకిస్తాన్ రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు చాలా పెద్ద సాహసమే చేసింది. దీని పర్యావసనాలు గట్టిగానే ఉండనున్నాయనే సమాచారం ఉంది. దీనిపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. పాక్ క్రికెట్ భవిష్యత్పై చాలా పెద్ద ప్రభావం చూపుతుందని హెచ్చిరించింది. ఐసీసీ చర్యలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈనెల 15న కొలొంబో వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను (గ్రూప్ స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ, చివరికి భారత్తో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్కప్ కోసం తమ జట్టును భారత్కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.
భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్తో మ్యాచ్ను మాత్రమే రద్దు చేసుకుంటున్న ప్రకటించింది.
ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది. పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ప్రతి భారత్ మ్యాచ్ విలువ సుమారు 10–11 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు ₹100 కోట్ల వరకు ఉంటుంది.
పాకిస్తాన్తో భారత్ మ్యాచ్కు వచ్చే సరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ద్వారా రూ. 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వహకులు అంచనా వేశారు. మ్యాచ్ జరగకపోతే, ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.
కాగా భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకోవడం వల్ల పాక్ క్రికెట్ బోర్డు ఆర్దికపరమైన నష్టాలతో పాటు పరిపాలనాపరమైన మరెన్నో కఠనమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది. ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీసే అవకాశం ఉంది. ఫైనల్గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు సుమారు రూ.2.29 కోట్ల నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే అవకాశం ఉంది.


