KTR Angry: స్పీకర్ తీరు రాజ్యాంగానికే గొడ్డలి పెట్టు..! కేటీఆర్‌ సీరియస్..!

ఎమ్మెల్యేల అనర్హత అంశంపై జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మండి పడ్డారు. ఎక్స్‌వేదికగా స్పీకర్‌ తీరును ఎండగట్టారు. ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ '' ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గారు వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ ను తిరస్కరించడం అర్థరహితం. అటు సుప్రీంకోర్టు తీర్పును, ఇటు ప్రజాతీర్పును కాలరాసి గోడదూకిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఓవైపు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ అసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తిపోస్తున్న తరుణంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీయడమే. పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్స్ అంటే భయపడుతోందని అర్థమైపోయింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని చూసి రేవంత్ సర్కారు వణికిపోతోందని తేలిపోయింది. పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటలకు ఆశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీకి ఇకనుంచి రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే నైతిక హక్కు లేదు.

పట్టపగలే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదు'' అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story