BRSలో చేరనున్న ఈటల రాజేందర్..?

ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడు. ప్రత్యేక రాష్ట్రం కోసం, అసెంబ్లీలో బయట ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఆయనది. పార్టీ పెట్టిన నాటి నుంచి సుదీర్ఘ కాలం పాటు కేసీఆర్ వెన్నంటే ఉండి గులాబీ పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఎక్కడ చెడిందో కానీ, కేసీఆర్కు, ఈటలకు పొసగలేదు. దీంతో ఆయన ఆ పార్టీ నుంచి దూరమయ్యారు. తనను బయటకు పంపించారు, నేను ఆ పార్టీని విడలేదు అని ఎన్నోసార్లు బయట చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నాయకుడు మళ్ళీ సొంతగూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? కేసిఆర్ను బాస్ అంటూ చేసిన కామెంట్స్ యాదృచ్చికమా లేదంటే రాజకీయ వ్యూహమా అనేది చర్చనీయాంశమైంది. కేసిఆర్కు అత్యంత సన్నిహితుడిగా పార్టీలో నెంబర్ 2గా ఈటల ఎదిగారు. కేసీఆర్ కుడిభుజంలా వ్యవహరించిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది .అలాంటి ఈటల రాజేందర్ ఇప్పుడు బిజెపీ ఎంపీ గా ఉన్నప్పటికీ, తాజాగా బిఆర్ఎస్ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేదు,అందుకే నన్ను మళ్ళీ కావాలనుకుంటున్నారు ఏమో అనే ఆయన మాటలు జరుగుతున్న ఘర్ వాపసీ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. ఈ వ్యాఖ్యలు సాధారణమైనవి కావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అవమానకరంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకుడు మళ్ళీ అదే పార్టీ గురించి సాఫ్ట్ గా మాట్లాడటం వెనుక తప్పకుండా ఏదో లోతైన వ్యూహం ఉంటుందనే భావన సహజంగానే కలుగుతోంది. బీజేపీలో చేరినప్పటికీ ఈటల రాజేందర్కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదన్న మాట బహిరంగంగానే వినిపిస్తుంది. జాతీయ నాయకత్వం ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించినప్పటికీ, రాష్ట్ర రాజకీయాలో ఆయన పాత్ర అంతగా ప్రభావవంతగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు ఉండటంతో ఈటల అక్కడ కొంత అప్సెట్గా ఉన్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒకప్పుడు సొంత పార్టీలో రెండో నెంబర్ స్థానంలో ఉన్న నాయకుడు ఇప్పుడు జాతీయ పార్టీలో సాధారణ ఎంపీ గా పరిమితం అవటం, ఆయనలో అసంతృప్తిని కలిగించిందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన భవిష్యత్తుపై అయోమయం మొదలైంది అంటున్నారు. రాజకీయ నాయకుడిగా తన ప్రభావం తగ్గిపోతుందన్న ఆందోళన, తిరిగి తనకు బలమైన వేదిక కావాలి అన్న ఆలోచన, ఇవన్నీ కలిపి ఈటలను మళ్ళీ పాత గూటి వైపు చూసేలా చేస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి తనకు మళ్ళీ ఆహ్వానం వస్తుందన్న సంకేతాలు బయటకి రావడం, ఆయన చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చాయి.
అయితే ఈటల తిరిగి బిఆర్ఎస్ లో చేరడ అంత సులభమైన వ్యవహారం కాదన్న వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. హుజూరాబాద్ నియోజక వర్గంలో ఈటలను ఓడించిన పాడి కౌశిక్ రెడ్డి, ప్రస్తుతం అక్కడ బిఆర్ఎస్ తరపున కీలకనేతగా ఉన్నారు. స్థానిక రాజకీయాలో ఆయనకు బలమైన పట్టు ఉంది, అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఈటల అదే నియోజక వర్గంలో రాజకీయంగా తన స్థానం సంపాదించుకోవడం కష్టమే అనే అభిప్రాయం ఉంది. అంతేకాదు గతంలో కేసిఆర్ స్వయంగా ఈటలపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ మంత్రి పదవి నుంచి తొలగించడం సాధారణ ఘటన కాదు. అది రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా పెద్ద గాయం లాంటిది, ఆ గాయాన్ని మర్చిపోయి ఈటల మళ్ళీ అదే పార్టీకి వెళ్ళటం అంటే, ఆయన రాజకీయ జీవితంలో చాలా పెద్ద మలుపుగా మారుతోంది. మరోవైపు బిఆర్ఎస్ అధిష్టానం కూడా తన గత వైఖరిని మార్చుకొని ఈటలను గర్వంగా ఆహ్వానిస్తుందా అనే సందేహం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, పార్టీకి బలమైన నాయకులు అవసరం ఉన్నా, ఎంపీ పదవికి రాజీనామా చేసి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో చేరడం రాజకీయంగా రిస్క్తో కూడిన నిర్ణయమే అవుతుంది. కొందరు దీనిని రాజకీయ ఆత్మహత్యతో పోల్చుతున్నారు కూడా, ఇలాంటి పరిస్థితిలో ఈటల చేస్తున్న వ్యాఖ్యలు ఆయన నిజంగా పార్టీ మార్పు కోసం సంకేతాలు ఇస్తున్నారా లేక తన విలువలను పెంచుకునేందుకు రెండు పార్టీల మధ్య సమతుకం పాటిస్తున్నారా అనే ప్రశ్న కీలకంగా మారింది. ఒకవైపు కేసీఆర్ని 'మా బాస్' అనడం, బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు చేసిన వ్యూహమా లేదంటే, బీఆర్ఎస్తో నిజమైన చర్చల ఫలితమా అన్నది బయటకు రావాల్సి ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, ఉండరు శాశ్వత మిత్రులు కూడా ఉండరు అన్న మాట తరుచూ వినిపిస్తుంది. అవసరాలే మిత్రత్వాలను, శత్రుత్వాలను నిర్ణయిస్తాయి. ఈటల రాజేందర్ విషయంలో కూడా అదే జరుగుతుందని అనిపిస్తుంది. ఆయన వ్యక్తిక్తిగత భవిష్యత్తు, రాజకీయ ప్రాధాన్యం తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర ఇవన్నీ మళ్ళీ పునర్నిర్వచించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చూస్తున్నారు విశ్లేషకులు. బీజేపీలో కొనసాగుతూ తన స్థానం బలోపేతం చేసుకుంటారా లేదంటే, పాతగూటికి తిరిగి వెళ్లి కొత్త అధ్యయనాన్ని మొదలు పెడతారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం ఆయన మాటలు తెలంగాణ రాజకీయాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఈటల నిర్ణయం.. బీఆర్ఎస్-బీజెపీ రాజకీయాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది


