KTR's emotional post: రేవంత్ బూతు పురాణం డైవర్షనే ! మనకు తెలంగాణ ముఖ్యం..! KTR ఎమోషనల్ పోస్ట్..!

రేవంత్రెడ్డి బూతుపురాణాన్ని పట్టించుకోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ కోరారు. ప్రజా సమస్యలు, మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి బూతు పురాణాన్ని ఎత్తుకున్నాడని ఆరోపించారు. ఎక్కడ ప్రజలు తమ సమస్యలపై నిలదీస్తారోనని అటెన్షన్ డైవర్షన్ డ్రామాకు రేవంత్రెడ్డి తెరలేపాడన్నారు కేటీఆర్. ఈ సందర్బంగా ఎక్స్లో పోస్ట్ చేస్తూ
'' తెలంగాణ సోదర సోదరీమణులారా, కోట్లాది మంది ఆశల రూపమైన గులాబీ సైనికులారా, నిజాన్ని నిర్భయంగా చాటే మీడియా మిత్రులారా..!
ఇవాళ తెలంగాణ గడ్డపై ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతోంది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్. ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి కేసీఆర్. ఆయన ఎప్పుడూ బిరుదుల కోసం పాకులాడలేదు, సన్మానాల కోసం తపించలేదు. ఎందుకంటే, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సన్మానం, సత్కారం.
ఉద్యమ సారథిగా పద్నాలుగేళ్లు చారిత్రాత్మక పోరాటం చేసినా తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ పల్లె పల్లెను పచ్చగ చేసినా.. ఆయన గుండె చప్పుడు అనుక్షణం తెలంగాణనే !
కానీ, నేడు అధికారం చేతిలో ఉందనే అహంకారంతో, తన వైఫల్యాలను, తన ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నాడు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు.. తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడి!
రేవంత్ రెడ్డి 'తిట్ల ట్రాప్'లో పడకండి! మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది మన వార్డుల్లో మౌలిక వసతుల మీద, రోడ్ల మీద, డ్రైనేజీల మీద, ఇంటింటికీ అందాల్సిన పథకాల మీద. కానీ రేవంత్ రెడ్డి తెలివిగా తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాడు. ఈ విషపు వలలో మనం పడకూడదు. మన చర్చ, మన నిలదీత కేవలం ప్రజల కన్నీటి మీదనే ఉండాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాని ఆరు గ్యారంటీల గురించి నిలదీయండి. ఆ నమ్మకద్రోహం మీద యుద్ధంలా చర్చను మార్చండి.
ఎరువుల కోసం క్యూ లైన్లలో పడరాని పాట్లు పడిన అన్నదాతల ఆవేదన గురించి, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న రైతన్నల కష్టాల గురించి అడగండి. ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల మానసిక ఘర్షణకు గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు బాధ్యత ఎవరిదని రేవంత్ రెడ్డిని గల్లా పట్టి అడగండి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధుల మనోవేదనకు, డీఏలు లేక, పీఆర్సీ ఊసే లేక నలిగిపోతున్న ఉద్యోగుల ఘర్షణకు గొంతుకగా మీరు నిలవండి. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ఇంటింటికీ వెళ్లి వివరించండి.
మన తెలంగాణ నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి అనే 'కోవర్టు' ద్రోహంపై నిప్పులు చెరగండి.
ప్రజల తీర్పే.. కేసీఆర్ కు ఇచ్చే అసలైన గౌరవం! పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత, ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు తీసుకెళ్లండి. రేవంత్ రెడ్డి గాలి మాటలకు, గాయిగత్తర బూతులకు కాలం చెల్లింది. సమస్యల నుంచి పారిపోవడానికి ఆ అసమర్థుడు వేస్తున్న పాచిపోయిన పాచికలను తిప్పికొట్టండి.
తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధ్రువతార. ఆయన కీర్తి, ఆయన స్ఫూర్తి నిరంతరం వెలుగులీనుతూ మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది. తెలంగాణ బిడ్డలారా.. చీకటి ఉన్నంత కాలం అబద్ధం ఆటలాడుతుంది.. కానీ సూర్యోదయం కాగానే తోకముడిచి పారిపోతుంది. తెలంగాణకు ఇది గ్రహణ కాలం. రేవంత్ అనే రాహువు తెలంగాణను కబళిస్తున్న కాలం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై, ఆయన చేస్తున్న ద్రోహంపై ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపిద్దాం. మన దృష్టిని ప్రజల సమస్యల మీదనే ఉంచుదాం.. మనకు ప్రాణసమానమైన తెలంగాణను ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందాం'' అంటూ KTR పిలుపునిచ్చారు.


