Telangana dream: తెలంగాణ కల సాకారం.. 'ది బిల్ ఈజ్ పాస్డ్'

తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన సుదినం ఫిబ్రవరి 20. ఎన్నో కన్నీళ్లు, బలిదానాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సరిగ్గా ఇదే రోజున (2014) తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మోక్షం లభించింది. నాడు UPA ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. 'ది బిల్ ఈజ్ పాస్డ్' అంటూ అప్పటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించగానే తెలంగాణ ప్రజల గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన ఈ చారిత్రక ఘట్టాన్ని తెలంగాణ ప్రజానీకం ఎప్పటికీ మరువలేరు.


2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు సమాచారం అందింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచే పార్లమెంటు ఆవరణలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది.

తెలంగాణ ఏర్పాటు అంశం ప్రతి నిమిషానికీ ఒక మలుపు తిరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఎక్కువ మంది ఎంపీలు లోక్‌సభకు తొలిసారి ఎన్నికైనవారే. దీంతో ఏం జరుగుతుందో తెలియక వారిలో అయోమయం, ఎలాగైనా తెలంగాణను సాధించుకోవాలన్న తపన కనిపిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఎలాగైనా అడ్డుకుంటామని ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీలంతా అప్పటికే ప్రకటించుకున్నారు. మరోవైపు కేసీఆర్ తాను ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్నానని, మళ్లీ తెలంగాణలోనే అడుగుపెడతానని హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. ఒక పక్క ఏపీ ఎంపీలు, చంద్రబాబు, ఇతర నేతలు బిల్లు పాస్‌ కాకూడదని ఎన్ని ప్రయత్నాలు జరిగినా, ఢిల్లీలోనే ఉండి పలువురు జాతీయ నేతలను కలుస్తూ బిల్లు పాస్ అయ్యేందుకు కేసీఆర్‌ విశ్వప్రయత్నాలు ఫలించాయి.

తెలంగాణ బిల్లుకు బీజేపీ పలు సవరణలను ప్రతిపాదించింది. అయితే, అవి రాజకీయ లబ్ధి కోసం చేసిన సవరణలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీ సింగ్ అన్నారు. అయినా, తెలంగాణ బిల్లు నిలిచిపోతుందనే భావన అప్పటికీ ప్రబలమవుతోంది. కారణం, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపీఏ 2 ప్రభుత్వానికి అవే ఆఖరి పార్లమెంటు సమావేశాలు. ఈ సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగిసిపోనున్నాయి. లోక్‌సభలోను, ఆ తర్వాత రాజ్యసభలోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది.

ఆ సందర్బంగా లోక్‌సభలో ఏపీ ఎంపీలు పెప్పర్‌ స్ప్రే చల్లారు. ఆ దశలో తెలంగాణకు చెందిన ఎంపీలు కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేసి మళ్లీ ప్రారంభించాక బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఒక రోజు వ్యవధిలో బిల్లును రాజ్యసభకు పంపించారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను 10 ఏళ్లకు పెంచాలని కోరారు. దీంతో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ లేచి బిల్లు ఇప్పటికే లోక్‌సభలో పాస్‌ అయి ఉన్నందున, ఇక్కడ సవరించాలంటే బిల్లు మళ్లీ లోక్‌సభకు వెళ్లాల్సి ఉంటుందని, రాజ్యసభ సమావేశాలు ముగిసే సమయం ఉన్నందున రాజ్యసభలో ప్రధాని లేచి ఏపీకి ప్రత్యేక హొదా 10 ఏళ్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణ బిల్లు పాసైంది. ఉత్కంఠ భరితంగా జరిగిన సమావేశాల్లో అటు ఏపీ, తెలంగాణ ప్రజలు టీవీలకు అతుక్కుపోయి చూశారు. బిల్లు పాస్‌ కావడంతో తెలంగాణ ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఊరువాడ సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లింది, రాష్ట్రపతి సంతకం తర్వాత జూన్‌ 2న అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.

Updated On 20 Feb 2026 4:42 AM GMT
ehatv

ehatv

Next Story