software engineer commits suicide: పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య..!

పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం తిలకుప్పకు చెందిన స్వామి నాయుడు, శ్రీదేవి దంపతుల కుమారుడు సతీష్ (31) మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బికే ఎంక్లేవ్ లో నివాసముంటూ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు .అయితే ఇతనికి సంవత్సరం క్రితం రవళి అనే యువతితో వివాహం జరిగింది. భార్య రవళి సంక్రాంతి పండుగ సందర్భంగా తన సొంత ఊరికి వెళ్లిపోవడంతో సతీష్ తన తమ్ముడితో కలిసి తన నివాసంలో ఉంటున్నాడు.
అయితే ఉదయం తన అన్న నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చి తమ్ముడు పలుసార్లు తలుపులు కొట్టాడు అయినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అన్న సతీష్, వదిన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. అప్పటికే అతను మృతి చెందినట్లుగా గుర్తించిన తమ్ముడు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. పని ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగానే ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.


