Kommineni Srinivasa Rao Arrest : బలిపశువులం ఎందుకు కావాలి?.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే.శ్రీనివాస్..!
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే.శ్రీనివాస్(K. Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు.

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే.శ్రీనివాస్(K. Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు. '' సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాస రావును నాన్ బెయిలబుల్ అభియోగాల కింద అరెస్టు చేయడం బాధాకరం. జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో భాగంగా వివాదాస్పదులు అయిన సందర్భాలలో, వారి మీద పోలీసు, అధికార యంత్రాంగాలను, క్రిమినల్ కేసులను ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
జర్నలిస్టుల అరెస్టులను సాధారణీకరించే క్రమం ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఇది ప్రమాదకరం. తప్పు జరిగింది నిజమే కావచ్చు కానీ, ఈ కేసులు, అరెస్టులు సభ్యత , సంస్కారాల రక్షణకు కాక , రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నట్టు కనిపించ గూడదు కదా !?
ఈ అరెస్టుకు దారితీసిన పరిణామాలలో మంచి చెడ్డలను, మూలకారణాలను నిర్ధారించడం కష్టం. నిస్సందేహంగా ఆ టీవీ చర్చ హీన అభిరుచితో సాగింది. దుర్మార్గమైన వ్యాఖ్య చేసిన అతను కూడా, ఒక సంపాదకుడట! కార్యక్రమంలో మోడరేటర్గా ఉండవలసిన కొమ్మినేని అతన్ని వారించి ఉండవలసింది, తాను ఆ వ్యాఖ్యతో ఏకీభవించడం లేదని అప్పుడే స్పష్టం చేసి ఉండవలసింది! ఆ ఛానల్ తరువాత అదే పని చేసి, చేతులు దులుపుకుంది. మరి ఆయనెందుకు ఆ పని చేయలేక పోయారు ?
బాధ్యతాయుత ప్రవర్తన నుంచి ఎడంగా జరిగే సందర్భాలు పాత్రికేయులకు, ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులకు, నేటి కాలంలో, తరచు వస్తున్నాయి. అందుకు, మీడియా లోని పోలరైజేషన్, ఒత్తిడులు కూడా కారణం. పబ్లిక్ వేదికల మీద దుర్భాషకు పట్టం కట్టింది అధికార, ప్రతిపక్ష పార్టీలే. మీడియాను శిబిరాలుగా చీల్చింది కూడా అవే. అధికారంలోకి రాగానే ఎదుటి పక్షం జర్నలిస్టులను వేధించడం అన్ని ప్రధాన పార్టీలకు అలవాటు అయింది. సోషల్ మీడియా, ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులతో మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు “ప్రధాన స్రవంతి” లోని పెద్ద జర్నలిస్టులను అగౌరవంగా అరెస్టు చేయడం దాకా వచ్చింది. మరి మన జర్నలిస్టులు మాత్రం ఈ అధికార మీడియా క్రీడలో ఎందుకు భాగం కావాలి, ఎందుకు అత్యుత్సాహం చూపాలి ? ఎందుకు బలిపశువులు కావాలి?'' అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
