Chiranjeevi Clarifies : జగన్ సాదరంగా ఆహ్వానించారు..! చిరంజీవి..!
సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించినట్లు సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను సాదరంగా ఆహ్వనించినట్లు సినీ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. అసలు వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలోనే తాను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని అప్పటి సీఎం జగన్కు వివరించినట్టు స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందిస్తూ చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ. ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టరును కలవండన్నాడట.. అంటూ బాలకృష్ణ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ చానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చినందుకు నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నా’’ అంటూ చిరంజీవి స్పందించారు. ఆ ప్రకటనలో చిరంజీవి ఇంకా ఏం చెప్పారంటే..
జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చారు. సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డీవీవీ దానయ్య, మైత్రి మూవీస్.. ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు నా దగ్గరకు వచ్చారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం సీఎంతో మాట్లాడి చెబుతానన్నారు. సినీ ప్రముఖుల అందరి సమక్షంలోనే నాటి సీఎం వైఎస్ జగన్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యం. నేను ఆ చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయంతో మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డి్రస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకొనే విధానంలోనే మాట్లాడతా. నేను ఇండియాలో లేను. అందుకే ప్రకటన విడుదల చేస్తున్నానని చిరంజీవి అన్నారు.
