Former minister Kanna: రాజకీయాలకు దూరంగా జరుగుతున్న మాజీ మంత్రి కన్నా..!
Former minister Kanna: రాజకీయాలకు దూరంగా జరుగుతున్న మాజీ మంత్రి కన్నా..!

మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు దూరం కానున్నారా. అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఆయన తన రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టే దిశగా ముందుకు సాగుతున్నారన్న చర్చ తెరమీదకు వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పల్నాడుకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని ప్రస్తావించటం, అంతర్గత చర్చల్లో కూడా కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు దూరమవుతారు అన్న వాదన వినిపించింది. కాంగ్రెస్తో ప్రారంభమైన కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలు తర్వాత కాలంలో బిజెపి వైపు మళ్లాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లాలని భావించినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని అప్పగించి ఆయనను తన వైపు తిప్పుకోగలిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో 2019 ఎన్నికల్లో ఆయన ద్వారా ఎంతో కొంత లాభం పొందాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అది సక్సెస్ కాలేకపోయింది. తర్వాత ఆయన టీడీపీలోకి రావడం, సత్తెనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇంతవరకు బాగానే ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ లో అసంతృప్తి నెలకొంది అన్నది వాస్తవం. చంద్రబాబు మంత్రివర్గంలో తనకు అవకాశం దక్కుతుందని ఆయన ఆశించారు. వాస్తవానికి గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత రాజకీయంగా ఆయన వేసిన అడుగుల కారణంగా ఆ పదవికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కోసం ఆయన ప్రయత్నించిన మాట వాస్తవమేనని ఆయన అనుచరులే చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకు అవకాశం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆయన అసంతృప్తికి ఇదే కారణమంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో కూడా కూటమి నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, కన్నా లక్ష్మీనారాయణను దాదాపు ఒక వర్గం పక్కన పెట్టడం వంటివి కూడా ఆయన రాజకీయాలను విరమించే అవకాశం ఉందన్న చర్చను తీసుకువచ్చాయి. ఇటీవల అంబటి రాంబాబు విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ పన్నెత్తు మాట కూడా అనలేకపోయారు.


