Jagan's key announcement: పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన.. ఏడాదిన్నర పాటు పాదయాత్ర..!
Jagan's key announcement: పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన.. ఏడాదిన్నర పాటు పాదయాత్ర..!

వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలందరూ వైసీపీ వైపే చూస్తున్నారు. కార్యకర్తలంతా తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఏలూరు నియోజకవర్గ కేడర్తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్కు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయని ప్రభుత్వం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైఎస్సార్సీపీ ఉంటుంది. విద్యార్థులు, రైతులు, యువత, అక్కచెల్లెమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నాం. జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. జగన్ ఉంటే, ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటాను.
ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతాను. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను. ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలే.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందన్నారు.


