Kadapa Politics : మేయర్ రాక్స్.. ఎమ్మెల్యే షాక్స్..!
కడప మేయర్ సురేష్బాబు, వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే , ప్రభుత్వ విఫ్ మాధవీరెడ్డికి భారీ షాక్ ఇచ్చారు.

కడప మేయర్ సురేష్బాబు, వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే , ప్రభుత్వ విఫ్ మాధవీరెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. ఇవాళ కడప నగరపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కొంతకాలంగా కడప నగర పాలక సర్వసభ్య సమావేశంలో మేయర్ సీటు పక్కనే తనకు కుర్చీ వేయాలని మాధవీరెడ్డి పట్టు పడుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం, ఎక్స్ అఫిషియో మెంబర్కు ముందు వరుసలో కుర్చీ వేస్తామని మేయర్ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తనకు కుర్చీ వేయకపోతే, నీకు మేయర్ సీటు లేకుండా చేస్తానని కడప ఎమ్మెల్యే ప్రతిజ్ఞ తీసుకున్నారు . అవినీతి ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చి, మేయర్పై అనర్హత వేటు వేయించి, తన తడాఖా చూడాలని మాధవీరెడ్డి ( Madhavi Reddy)బాగానే కష్టపడ్డారు. అయితే హైకోర్టులో మేయర్కు ఊరట లభించింది. అనర్హత వేటుపై స్టే విధించడంతో సురేష్బాబు తిరిగి ఈరోజు సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు పటిష్ట భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు కమిషనర్ మనోజ్రెడ్డి(manoj Reddy) వైఖరి కూడా వివాదాస్పదమవుతోంది. నిబంధనల ప్రకారం కాకుండా, అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు ఇష్టానుసారం నడుచుకుంటున్నాడని వైసీపీ(YCP) నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప కార్పొరేషన్ పాలక మండలి సమావేశ హాల్లో కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫిషియోలనే కారణంతో, మేయర్ సీటు పక్కనే కుర్చీలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ సురేష్బాబు (Mayor Suresh Babu)అక్కడికి వెళ్లకుండా తన చాంబర్లోనే సమావేశం నిర్వహిస్తున్నామని, మున్సిపల్ కమిషనర్ను తన చాంబర్కే రావాలని ఆదేశించారు. మేయర్ చాంబర్లో 35 మందికి పైగా కార్పొరేటర్లు, సమావేశ మందిరంలో కేవలం 8 మంది కార్పొరేటర్లు ఉన్నట్టు తెలిసింది. దీంతో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి షాక్కు గురయ్యారు. కమిషనర్తో మేయర్ పక్కనే కుక్చీలు వేయించుకున్నా తన పంతం నెగ్గకపోవడంతో మరో సారి ఈ అంశం చర్చనీయాంశమైంది.
