Rise Survey 2025 : ఏడాది పాలనపై రైజ్ సంస్థ సర్వే.. షాకింగ్ రిజల్ట్స్.. గ్రీన్జోన్లో కేవలం 32 మందే..!
కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైజ్ అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది.

కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైజ్ అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని చూస్తే షాక్ అవుతారు. గత ఎన్నికల్లో కూటమికి 164 అసెంబ్లీ, వైసీపీకి 11 సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే ప్రశ్నకు 64 శాతం మంది బాగా లేదని చెప్పడం గమనార్హం. బాగుందన్న వాళ్లు కేవలం 28 శాతం మాత్రమే ఉన్నారు. ఇక చెప్పలేం అని 8 శాతం అన్నారు. ఏడాది పాలన పూర్తయ్యే సరికి గ్రీన్ జోన్లో 32 మంది ఉన్నారు.. ఇదే సందర్భంలో 53 మంది ఎమ్మెల్యేలు రెడ్జోన్లో, 90 మంది ఎమ్మెల్యేలు ఆరేంజ్ జోన్లో ఉన్నారు. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఒకరు, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం.అయితే కూటమికి అనుకూలంగా ఉన్న విషయం ఏంటంటే…ప్రభుత్వ పనితీరు బాగుందని 52.80 శాతం, బాగాలేదని 26 శాతం, ఫర్వాలేదని అభిప్రాయపడ్డవాళ్లు 21.20 శాతం మంది ఉన్నారు. కూటమి, అలాగే వైసీపీ పాలన…రెండింటిని పోల్చి అడిగినప్పుడు చంద్రబాబు(Chandrababu) సర్కార్కు 51 శాతం, వైసీపీ(YCP)కి 38 శాతం, చెప్పలేమని అన్నవాళ్లు 11 శాతం ఉన్నారు. అయితే సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్ జగన్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. ఎక్కువ సంక్షేమం అందించిన సీఎంగా జగన్కు 52 శాతం, చంద్రబాబుకు 48 శాతం మార్కులు దక్కాయి. అభివృద్ధి విషయంలో మాత్రం కూటమి వైపు 59 శాతం, వైసీపీకి 41 శాతం మద్దతు పలికారు. అమరావతిపైనే ఎక్కువ దృష్టి సారించారని 78 శాతం మంది మంది ప్రజలన్నట్టు సర్వేలో వెల్లడించింది. రాజధాని అభివృద్ధి చెందాలని 22 శాతం అభిప్రాయపడ్డారు.
రోడ్ల మరమ్మతులు, పెట్టుబడుల రాక, తల్లికి వందనం(Talliki vandhanam), రాజధాని అభివృద్ధి, ఉచిత గ్యాస్ సిలిండర్(Free Gas), పంచాయతీల అభివృద్ధి కూటమికి కలిసొచ్చే అంశాలుగా రైజ్ సంస్థ తెలిపింది.
ఇదే సందర్భంలో అమరావతి(Amaravathi)లో రెండో విడత భూసేకరణ, కక్ష సాధింపు పాలన, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల విచ్చలవిడి అవినీతి, విద్యుత్ చార్జీల పెంపు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం, గ్రామీణ ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించడం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజీలు కూటమి ప్రభుత్వానికి మైనస్గా మారాయి.
అయితే కేబినెట్లో కేవలం ఐదుగురు మంత్రులే బాగా పనిచేస్తున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్(Pawan kalyan), మంత్రులు లోకేశ్, పి.నారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు. కొల్లు రవీంద్ర, సత్యకుమార్, ఎండీ ఫరూక్, కొలుసు పార్థసారథి, డోల శ్రీబాలాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్రెడ్డి, ఎస్.సవిత, మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డి, వాసంశెట్టి సుభాష్ పనిచేయని జాబితాలో ఉన్నారు. కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి ఫర్వాలేదు అనిపించుకున్నారు.
కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. రైజ్ సర్వేలో కూడా మరోసారి అదే అభిప్రాయం వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేలను కట్టడిచేయకుంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు అనుకూలంగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో వైఎస్ జగన్ (Ys Jagan)తమ ఎమ్మెల్యేల దోపిడీని, అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోవడంతోనే దారుణ ఓటమిని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల్ని తూ.చ తప్పకుండా ఎందుకు ఓడిపోయానని జగన్ ఆవేదనతో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వుందని, ఎన్నికల సమయానికి గుర్తించి, భారీగా మార్పుచేర్పులు చేసినప్పటికీ, అప్పటికే చేయిదాటి పోవడంతో వైసీపీకి ఓటమి తప్పలేదు.
