Chandrababu : త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

TDP chief Chandrababu visited Tirumala Temple
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) దంపతులు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం.. చంద్రబాబు, భువనేశ్వరి(Bhuvaneshwari) దంపతులకు పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తాను శ్రీవారి పాదాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. 2003లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడు అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడికి గురైయ్యానని.. అప్పుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే నాకు ప్రాణభిక్ష పెట్టారన్నారని వివరించారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకుంటానన్నారు. ప్రతి రోజూ తాను శ్రీవారిని తలుస్తానన్నారు. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని.. తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే ఉండాలన్నారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అనంతరం తిరుమల నుంచి రేణిగుంట(Renigunta) విమానాశ్రయం చేరుకొని ఉండవల్లి(Undavalli)కి పయనమయ్యారు.
