Astrologer Venu Swamy : సెప్టెంబర్ 1 వరకు ఈ రాశుల వారికి చాలా డేంజర్.. చాలా జాగ్రత్త.. వేణుస్వామి సంచలన జోస్యం..!
వేణు స్వామి ప్రముఖ జ్యోతిష్యుడిగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి. తన జ్యోతిష్య భవిష్యవాణిల ద్వారా అనేక సంచలనాలు సృష్టించారు.

వేణు స్వామి ప్రముఖ జ్యోతిష్యుడిగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి. తన జ్యోతిష్య భవిష్యవాణిల ద్వారా అనేక సంచలనాలు సృష్టించారు. ఆయన సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చేసిన ఊహాగానాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికలపై తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సమంతా రూత్ ప్రభు, నాగ చైతన్య వివాహ జీవితం సాఫీగా సాగదని, వారు విడిపోతారని వేణు స్వామి చెప్పారు, ఇది తర్వాత నిజమైంది. అలాగే, నిహారిక కొణిదెల విడాకుల గురించి కూడా ముందుగా చెప్పి సంచలనం రేపారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "రాధేశ్యామ్"(Radhe Shyam), "ఆదిపురుష్"(Adipurush) సినిమాలు విజయవంతం కావని ఆయన భవిష్యవాణి చేశారు, ఇవి ఫ్లాప్ కావడంతో ఆయన పాపులారిటీ సోషల్ మీడియాలో పెరిగింది. చంద్రబాబు నాయుడు, కె. కవిత అరెస్ట్ అవుతారని వేణు స్వామి చెప్పిన భవిష్యవాణి నిజమైంది. 2024 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పినవి తప్పడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రులుగా గెలుస్తారని చెప్పిన ఆయన ఊహాగానాలు నిజం కాలేదు. 2025 ఉగాది పంచాంగంలో వేణు స్వామి భూకంపాలు, విమాన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల గురించి హెచ్చరించారు. ఈ భవిష్యవాణి కొంతమేరకు సరిపోలడంతో నెటిజన్లు ఆయనను కీర్తించారు.
ఇదే విధంగా వేణుస్వామి మరో సంచలన ఆడియో విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఐదు రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. సింహరాశిలో కుజ, కేతుల కలయికతో సమస్యలు రానున్నాయని ఆయన వివరించారు. ''సింహ రాశి, కన్యారాశి, మకర రాశి, మీనరాశి, వృషభ రాశి'' ఈ రాశుల వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు. విపరీతంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారన్నారు. నరాల ఇబ్బందులు, లీగల్ సమస్యలు, తల్లి అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టం జరగడం, వాహన ప్రమాదాలు, భార్యభర్తల గొడవలు జరుగుతాయన్నారు. ఈ రాశుల వారికి ప్రయాణాల గండం ఉందని, విమాన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భూకంపాలు, ఇంటర్నెట్ నిలిచిపోవడం, సోషల్ మీడియా అకౌంట్లు ఫ్రీజ్ కావడం వంటివి ఉంటాయన్నారు. ముఖ్యంగా ఎరుపు రంగు వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. చిన్నచిన్న జపాలు చేసుకోవాలన్నారు. ప్రతీ మంగళవారం నాడు కుజ, కేతువు పూజలు చేయాలని.. ఎరుపు రంగు బట్టలు ధరించాలని సూచించారు.
