ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామంలో పరువు హత్య జరిగింది.

ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామంలో పరువు హత్య జరిగింది. పెళ్ళైన 10 రోజులకే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్కు, దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతితో పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే.. గణేష్ పొట్టిగా ఉన్నాడని యువతి తల్లిదండ్రులు సంబంధం వద్దనుకున్నారు. కానీ పెళ్లి చూపులోనే గణేష్, కీర్తి.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకొని, రోజు ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. తాము వివాహం చేసుకుంటామని చెప్పగా.. పెద్దలు అంగీకరించలేదు. దీంతో పది రోజుల కిందట పారిపోయి అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే గణేష్ పొట్టిగా ఉన్నాడని కీర్తి సోదరుడు దుర్గారావు అసహ్యం పెంచుకున్నాడు. తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. వివాహం జరిగిన నాడే గణేష్ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు కూడా. దీంతో.. తనకు యువతి కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులను గణేష్ ఆశ్రయించాడు కూడా. గణేష్ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి. గణేష్ పెళ్లి చేసుకోవడంపై కీర్తి తల్లిదండ్రులు, బావమరిది ఆగ్రహం వ్యక్తం చేశారు. బావమరిది దుర్గారావు గణేష్పై ఆగ్రహం పెంచుకుని, తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ హత్యకు స్కెచ్ వేశాడు. తమ పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులతో గణేష్ ఇంటికి పయనం అయ్యాడు. దారిలో గణేష్ను ఆటకాయించి.. కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు దుర్గారావు. ఆపై దుర్గారావును, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
