MahaShivarathri: శివయ్యకు ప్రసాదంగా ''గంజాయి''...? ఫేమస్ కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా...?

మహాశివరాత్రి పర్వదినాన ఈ నెల 15న ఇద్దరు యువకుల శంషాబాద్ శివారులోని ఓ శివాలయానికి వెళ్లి ‘శివుడికి అందరూ కొబ్బరి కాయలు కొడతారు...కాని మేము స్పెషల్ ప్రసాదం పెడుతున్నామంటూ గంజాయి’ చూపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్గా మారిన ఈ వీడియోను చూసిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం ఫలక్నుమా పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. ''రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తారా'' అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మహా శివరాత్రి భక్తికి నిదర్శనం...ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు...ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగిస్తే...జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.
లైక్ల కోసంలోకాన్ని మరిచి వ్యూస్ కోసం విలువలనే వదిలి..రీల్స్ కోసం రోడ్డున పడి...మత్తులో మునిగిజీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి...వ్యసనాలకు వాకిలిగా కాదు’......అంటూ చెప్పుకొచ్చారు.


