Sexual harassment: పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు... మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న టీచర్..!

పాఠాలు చెప్పాల్సిన గురువు ఓ బాలిక పట్ల కామాంధుడిగా మారాడు. అన్నోజిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో పర్రే మైటీన్ (27) భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించిన తల్లి ఒక్కసారిగా షాక్కు గురైంది. విషయమేంటని నిలదీయడంతో తన స్కూల్ లో ఫిజిక్స్ టీచర్ పర్రే మైటీన్ తనను పెళ్లి చేసుకున్నాడని సమాధానం చెప్ప డంతో తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ను నిలదీశారు. ప్రిన్సిపాల్ తనకు ఏమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఉపాధ్యాయుడు పర్రే మైటీనన్ను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం బయటకు పొక్కితే పాఠశాల పరువు పోతుందని భావించిన యాజమాన్యం ఉపాధ్యాయుడిని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు పర్రే మైటీన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. విద్యార్థినిపై వేధింపుల వ్యవహారం పాఠశాలలో జరగలేదని, ఉపాధ్యాయుడు పర్రే మైటీన్ను విధుల నుంచి తొలగించామని యాజమాన్యం ప్రకటించింది. ఉపాధ్యాయుడితో పాటు, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


