దొంగిలించిన బంగారు ఆభరణాన్ని తిరిగి అదే ఇంటిముందు వదిలేసి వెళ్లిపోయాడు ఓ దొంగ.

దొంగిలించిన బంగారు ఆభరణాన్ని తిరిగి అదే ఇంటిముందు వదిలేసి వెళ్లిపోయాడు ఓ దొంగ. దొరికి పోతానని భావించాడో.. ఇతరత్రా కారణాలు ఏంటో తెలియవు కానీ.. రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాన్ని మాత్రం బాధితురాలి ఇంటి ముందు వదిలేసి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కాట్రేవు గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గున్రెడ్డి రంగారెడ్డి, సత్తమ్మ దంపతుల కుమారులు.. జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. వృద్ధ దంపతులిద్దరే ఇంటి వద్ద ఉంటున్నారు.
ఎప్పట్లాగే బుధవారం ఉద యం 5 గంటలకు రంగారెడ్డి పాలు తీసుకొచ్చేందుకు ఇంటినుంచి బయట కు వెళ్లాడు. సత్తమ్మ ఇంట్లోనే పడుకుంది. ఆ సమయంలో తలుపులకు గడియ పెట్టకపోవడంతో.. నేరుగా దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. పడుకు న్న వృద్ధురాలి తలకు దుప్పటి చుట్టి.. కొట్టి.. ఆమె దిండు కింద ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడుతో పారిపోయాడు. అయితే దొంగ చోరీ చేసే ముందు వీధి దీపాలను ఆపేశాడు. ఇంత పకడ్బందీగా చోరీ చేసిన దొంగ కొత్త వ్యక్తి అయితే కాదని గ్రామస్తులు భావించారు. ఘటన జరిగిన రోజు పోలీ సులు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు జాగిలాలు వస్తాయని, దొంగ ఎక్కడున్నా పట్టుకుంటాయని గ్రామంలో చర్చ జరిగింది. ఇలాగైతే తాను దొరికిపోతానని, పరువుపోతుందని భావించిన ఆ దొంగ.. రెండు రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి బంగారు ఆభరణాన్ని తిరిగి బాధితురాలికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో బాధితురాలి ఇంటి తలుపు వద్ద పుస్తెలతాడు వదిలేసి వెళ్లాడు. పాలు తీసుకొచ్చేందుకు బయటికెళ్తున్న బాధితురాలి భర్త రంగారెడ్డి.. పుస్తెలతాడును తీసుకున్నాడు.


