ఈ మధ్య కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా తదితర యాప్లతో పరిచయాలు పెరగడంతో బంధుమిత్రుల సమక్షంలో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వివాహం చేసుకున్న భాగస్వాములను వదిలేసి వెళ్లడం చాలా సాధారణమైంది.

ఈ మధ్య కాలంలో ఫేస్బుక్, ఇన్స్టా తదితర యాప్లతో పరిచయాలు పెరగడంతో బంధుమిత్రుల సమక్షంలో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వివాహం చేసుకున్న భాగస్వాములను వదిలేసి వెళ్లడం చాలా సాధారణమైంది. దీనివల్ల గొడవలు జరిగి కుటుంబాలు రోడ్ల పాలవుతుంటే అభం శుభం తెలియని పిల్లల జీవితం రోడ్డున పడుతోంది. బెంగళూరు బన్నేరుఘట్ట పరిధిలో ఇదే తరహాలో భర్తను వదిలేసి ప్రియునితో వెళ్లిపోయిన మహిళ.. కొన్ని నెలల తరువాత తనకు భర్తే కావాలంటూ ఆయన దగ్గరికి మళ్లీ వచ్చేసింది. దీంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే
ఈ ఏడాది సెప్టెంబరు చివరిలో లీల అనే మహిళ భర్త, క్యాబ్డ్రైవర్ మంజునాథ్, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడు సంతుతో వెళ్లిపోయింది. మంజు కన్నీరు కారుస్తూ తన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తిరిగి రావాలని భర్త విలపిస్తూ చేసిన వీడియో ప్రచారమైంది. తాను మాత్రం సంతుతోనే ఉంటానని లీల చెప్పింది. సంతు, లీల సరదా ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ బాగోతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. నెలన్నర కిందట మంజునాథ్ కోపం పట్టలేక సంతును వెతికిపట్టుకుని చితకబాదాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కేసులో మంజునాథ్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవలే విడుదలై కొత్త ఆటోను కొనుక్కుని పిల్లలను పోషిస్తున్నాడు. ఇంతలో లీల మనసులో ఏం పరివర్తన వచ్చిందో గానీ ప్రియుడిని వదిలేసి భర్త చెంతకు చేరింది. మంజు ఆమెను ఆత్మీయంగా స్వాగతించాడు. బన్నేరుఘట్టలోని అద్దె ఇంట్లో కులాసాగా కాపురం ప్రారంభించారు. త్వరలో ధర్మస్థలలో మళ్లీ పెళ్లి చేసుకుంటామని, అన్నీ మరచిపోయి సంతోషంగా జీవిస్తామని ఈ జంట చెబుతోంది. ఇది చూస్తే ఎలా స్పందించాలోనని నెటిజన్లు వాపోతే, మరికొందరు దీవించారు.


