Srisailam News: శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త..!

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలం శైవ క్షేత్రంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18 వరకు మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాల కోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. దేవస్థానం బ్రహ్మోత్సవాలతో పాటు ఈనెల 15వ తేదీన మహా శివరాత్రి సందర్బంగా వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహా శివరాత్రి నేపథ్యంలో శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఈ నెల 14, 15 తేదీల్లో టోల్ ఫీజు లేకుండానే వాహనదారులను అనుమతించనున్నారు.

అలాగే ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు భక్తులకు ఉచితంగా లడ్డూలు అందచేయాలని నిర్ణయించారు. క్యూలో ఉండే భక్తుల కోసం పాలు, బిస్కెట్లు, అల్పాహారం కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక భక్తుల సౌకర్యం కోసం మంచినీరు మౌలిక సదుపాయాలు భద్రత ఏర్పాట్లు కూడా చేస్తోంది.30 అదనపు లడ్డూ కౌంటర్లు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ ఏడాది భక్తుల రద్దీ గత ఏడాది కంటే 30 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉందని మంత్రులు, అధికారుల బృందం అంచనా వేసింది. సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల వినతిమేరకు 4వ తేదీ నుంచి నల్లమల మీదుగా పాదయాత్రగా వచ్చే భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్‌ ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated On
ehatv

ehatv

Next Story