తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కీలక సూచన చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కీలక సూచన చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, దీన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు(CM Chandrababu)కు సూచిస్తూ, "కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, ప్రధాని మోదీ మీ మాట వినొచ్చు. కానీ, అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని భ్రమపడొద్దు" అని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం పోలవరం నుంచి గోదావరి జలాల(Godhavari Water)ను రాయలసీమకు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టు(banakacherla Project)ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 200 టీఎంసీఎఫ్టీ వరద నీటిని రాయలసీమకు మళ్లించాలని ఏపీ ప్రణాళిక వేసింది. అయితే, ఈ ప్రాజెక్టు తెలంగాణలోని రైతులకు నీటి లభ్యతను తీవ్రంగా దెబ్బతీస్తుందని, రాష్ట్ర హక్కులకు భంగం కలిగిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
జూన్ 18న హైదరాబాద్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. "రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయస్థానాలు, ప్రజల మధ్యకు వెళ్లడమే మా దారి" అని రేవంత్ పేర్కొన్నారు.
2019లో అప్పటి తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్(KCR), ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (Ys Jagan)కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రణాళికపై చర్చించారని రేవంత్ గుర్తు చేశారు. 2016లో కేంద్రం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్, గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, దాన్ని ఉపయోగించుకోవచ్చని అన్నారని రేవంత్ విమర్శించారు. "ఆనాడు కేసీఆర్ చేసిన సంతకం ఇప్పుడు తెలంగాణకు పెద్ద ప్రతిబంధకంగా మారింది" అని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రైతులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయబోమని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి అవసరమైన అన్ని చట్టపరమైన, రాజకీయ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన, తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉండటం వల్ల నీటి పారుదల కోసం ఎత్తిపోతల పథకాలపై ఆధారపడాల్సి ఉందని, అటువంటి పరిస్థితిలో బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని వివరించారు.
రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)తో కలిసి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ఢిల్లీ (Delhi)వెళ్లారు. ఈ రోజు (June 19) ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్(CR Patil)తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రానికి సమర్పించి, బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని కోరనున్నారు.
