NTR చనిపోయే ముందు రోజు ఏమి జరిగింది? ప్రత్యక్ష సాక్షి ,ప్రముఖ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ మాటల్లో..!

NTR చనిపోయే ముందు రోజు ఏమి జరిగింది? ప్రత్యక్ష సాక్షి ,ప్రముఖ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ మాటల్లో..!

"నేను ఢిల్లీ లో ఉద్యోగం చేసేవాడిని , సంక్రాంతి పండుగకి సికింద్రాబాద్ ఇంటికి వచ్చా , "జనవరి 17 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామా రావు గారింటికి (రోడ్ నంబర్ 13 , బంజారా హిల్స్ ) వెళ్ళా ;ఆయన్ని, లక్ష్మి పార్వతిని కలసి చాలా గంటలు గడిపా ;

"ఎంతైనా మహా నటుడు కదా ;ఆయన హృదయంలో తీవ్ర ఆందోళన ఉన్నా పైకి నవ్వుతూనే మాతో గడిపారు " సాయంత్రం 4 గంటలు అయింది, అన్నగారి ఆఖరి కుమారుడు జై శంకర్ కృష్ణ వచ్చి కొంచెం సేపు మాట్లాడి డబ్బులు అడిగి తీసుకెళ్ళాడు ;

సాయంత్రం 5 గంటలు : అన్న గారి ముఖంలో తీవ్ర ఆందోళన, సాయంత్రం 6 గంటలు : తెలుగు దేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్ ;ఎన్ . వి. రమణ , శ్రీనివాస రావు అన్నగారి దగ్గరకు వచ్చారు.

సాయంత్రం 6.30 నిమిషాలు : ఒక్కసారిగా ఏం బ్రదర్స్ ?!! ఏం జరిగింది ?? 'సార్ , హై కోర్ట్ లో మనం కేసు ఓడిపోయాం!తెలుగు దేశం పార్టీ బాంక్ ఖాతాలు అన్నీ చంద్ర బాబు పార్టీ కే చెందుతాయని , బాంకుల్లో మీ సంతకాలు చెల్లవని చీఫ్ జస్టిస్ ప్రభా శంకర్ మిశ్రా నేతృత్వం లోని బెంచ్ తీర్పు చెప్పింది !' అన్నారు

ఖిన్నుడైన అన్నగారు కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి, 'దరిద్రులు ,చండాలురు, మోసగాళ్ళు, పిల్ల నిచ్చి, పదవి ఇచ్చి , ఆస్తి ఇచ్చి, ఆదరించి , అభిమానించి మంత్రిని చేస్తే, శాసనసభ్యుల్ని , ఆస్తుల్ని ,పార్టీని ,పార్టీ గుర్తుని దొబ్బెసాడు!'అంటూ గట్టిగా అరుస్తూ భోరు భోరున విలపిస్తూ ,గుండె బాదుకుంటూ తన బెడ్ రూమ్‌లోకి వెళ్ళిపోయారు!

లోపల గడియ పెట్టేసుకున్నారు !లక్ష్మి పార్వతి , నేను , అశోక్ ఎంత పిలిచినా తలుపు కొట్టినా తలుపు తీయలేదు ! రాత్రి 8.00 గంటలకి తలుపు తీసి, గదిలో ఉన్న వస్తువులన్నీ గిరాటేసి 'జీవితంలో నమ్మి మోసపోయా! 'అంటూ ఏడుస్తూనే ఉన్నారు! పాలు ఇస్తే తాగలేదు,భోజనం చెయ్యమంటే చెయ్యలేదు!

రాత్రి 9 గంటలు: రమేష్ ! అన్నగారికి ఎక్కిళ్ళు వస్తున్నాయ్, మంచినీళ్ళు ఇస్తే త్రాగడం లేదు, అందరూ రండి, మంచి నీళ్ళు త్రాగిద్దాం !'అని లక్ష్మి పార్వతి పిలిస్తే ,వెళ్లి బ్రతిమిలాడగా ,బ్రతిమిలాడగా "గుక్కెడు మంచినీళ్ళు త్రాగారు' ఏడుపు ఆగలేదు! ఎక్కిళ్ళు ఆగలేదు! అందరూ వెళ్ళిపొండి!' అని ఆదేశాలు జారీ చేశారు !అందరం బయటకు వచ్చేశాం !లక్ష్మి పార్వతి అన్నగారిని ఓదారుస్తోంది!

ఆ రోజు రాత్రి ఒంటిగంట వరకు ఆయన ఇంట్లోనే ఉన్నా ,తర్వాత బయలుదేరి పద్మారావు నగర్ ఇంటికి చేరుకున్నా! నాలో ఆందోళన ,భయంతో నిద్ర రావడం లేదు ! తెల్లవారున 4 గంటలకి కొంచెం నిద్ర వస్తోంది ! అప్పుడే నా పెద్ద కూతురు నళిని వచ్చి 'డాడీ,లక్ష్మి పార్వతి మేడం ఫోన్ చేశారు !లైన్ లో ఉన్నారు!' అని చెప్పింది.

ఫోన్ రిసీవర్ అందుకున్నా ,లక్ష్మి పార్వతి మాటలకు హతాసుడినయ్యా! నా నోరు మూగబోయింది! మూర్చ వచ్చేట్లు ఉండి కూడా మొహం కడుక్కుని అన్నగారింటికి బయలుదేరా! ఆ దృశ్యాన్ని చూడలేకపోయా !

"అన్నా ,నీ అనురాగం'' "ఎన్నెన్నో జన్మల బంధం నీదీ -నాదీ" అనుకుంటూ, విషన్నవదనంతో అక్కడే కుప్పకూలిపోయా , NTR గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని మనసారా ప్రార్ధిస్తూ! '' ------ ప్రముఖ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్

Updated On
ehatv

ehatv

Next Story