భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో పలువురు ఎంపీలకు షాక్ ఇచ్చింది

భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో పలువురు ఎంపీలకు షాక్ ఇచ్చింది
భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో పలువురు ఎంపీలకు షాక్ ఇచ్చింది. ఏకంగా 33 మంది సిట్టింగ్ లను పక్కన పెట్టింది. కొన్ని ఊహించని మార్పులతో, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. 33 మంది సిట్టింగ్ ఎంపీలను కొత్త ముఖాలతో భర్తీ చేసింది. కాషాయ పార్టీ లోక్సభ లైనప్లోని మొదటి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు.. అస్సాం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమ బెంగాల్లలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు సహా 95 మంది పేర్లు ఉన్నాయి.
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులుగా ఎంపికైన ఐదుగురిలో నలుగురు సిట్టింగ్ ఎంపీల స్థానంలోకి వచ్చారు. చాందినీ చౌక్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ను తప్పించి, ప్రవీణ్ ఖండేల్వాల్కు కేటాయించారు. పశ్చిమ ఢిల్లీ స్థానంలో రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ స్థానంలో కమల్జీత్ సెహ్రావత్ ఎంపికయ్యారు. దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగగా, సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఇలా పలు రాష్ట్రాలలో ప్రముఖ నేతలకు భారతీయ జనతా పార్టీ షాక్ ఇచ్చింది.
