Minor Daughters into Prostitution: మైనర్ కూతుర్లను కస్టమర్ల వద్దకు పంపించి రోజుకు లక్షన్నర వసూలు చేస్తున్న తండ్రి..!

ఫిబ్రవరి 20న రాజస్థాన్కు చెందిన 14, 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లను నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) రక్షించింది. కోపర్ఖైరానేలో తండ్రి, ఒక బ్రోకర్ బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారన్న సమాచారంతో అధికారులు ఈ రక్షణ చర్యలు చేపట్టారు.
హరీష్ వికాస్ చారి అనే బ్రోకర్ను అరెస్టు చేసి, పరారీలో ఉన్న తండ్రి రాజ్ సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కస్టమర్ల నుంచి ఒక అమ్మాయికి రోజుకు రూ.1.5 లక్షల నుండి రూ.1.7 లక్షల వరకు నిందితులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నేరుగా కస్టమర్ ఎంచుకున్న ప్రదేశాలకు మైనర్లను తరలిస్తూ ఈ వ్యాపారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత (BNS), అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద FIR నమోదు చేశారు. బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంచి, పునరావాసం కోసం ఉల్హాస్నగర్లోని షెల్టర్ హోమ్కు తరలించారు.
నవీ ముంబైలో మైనర్లతో వ్యభిచార ముఠా నిర్వహిస్తున్నట్లు AHTUకి విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. సీనియర్ ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్ ఘోర్పడే మాట్లాడుతూ, అధికారులే కస్టమర్లుగా నటించి, బాలికలను తాము చెప్పిన ప్రదేశానికి తీసుకురావాలని బ్రోకర చారీకి సూచించారు. మైనర్లను తాము చెప్పిన చోటుకు తీసుకురావడంతో వెంటనే పోలీసులు బ్రోకర్ను అరెస్ట్ చేసి బాలికలను రక్షించారు.
ప్రాథమిక విచారణలో, బాలికల తండ్రి ఈ వ్యభిచారానికి పాల్పడుతున్నాడని, గత నాలుగు నెలలుగా తన కుమార్తెలను తన వద్దకు పంపాడని బ్రోకర్ చారీ తెలిపారు. హోటళ్లు, లాడ్జీల్లో అయితే పోలీసుల నిఘా ఉంటుందని, దీంతో మైనర్ బాలికలను కస్టమర్లు ఎంచుకున్న ప్రదేశాలకు తరలించేవారని, వారి నుంచి రోజుకు రూ.1.7 లక్షల వరకు వసూలు చేశారని పోలీసులు వెల్లడించారు.పరారీలో ఉన్న తండ్రిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.


