Newly wed couple: కాళ్ల పారాణి ఆడలేదు.. అంతలోనే అనంతలోకాలకు దంపతులు..!

ఆ జంటకు కొత్తగాఈ పెళ్లయింది. పెట్టుకున్న కాళ్ల పారాణి ఆరలేదు, గోరింటాకు ఇంకా పోలేదు, ఇంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయి తీరని శోకం మిగిల్చారు. పట్టుమని 15 రోజులకే కొత్త దంపతులు మరణించారు. కలిసి జీవిస్తామని బాసలు చేసినవారు కలిసే చనిపోయారని అందరూ కన్నీరు పెట్టారు. నిండు నూరేళ్లు కలిసి బతికి పిల్లాపాపలతో జీవించాల్సినవారు అంతలోనే కన్న తల్లిదండ్రలకు కన్నీరు మిగిల్చారు. ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం చెందారు. ఈ దుస్సంఘటన హావేరి జిల్లా శిగ్గావ్ తాలూకా కడహళ్లి గ్రామం సమీపంలోని 48వ జాతీయ రహదారిపై జరిగింది.
కర్నాటకలోని శిగ్గావ్ నివాసులు కార్తీక్ హుగార్ (34), ఐశ్వర్య (30)కు 15 రోజుల క్రితమే ఆడంబరంగా వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బంధువులతో కలిసి గదగ్ జిల్లా నవలగుందలోని కామణ్ణ ఆలయ దర్శనానికి కారులో వెళ్లి తిరిగివస్తున్నారు. ఘటనాస్థలిలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. గాయాలతో దంపతులు స్పాట్లోనే కన్నుమూశారు. మల్లికార్జున, వినాయక అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు కలిసి నుజ్జయిన కారులో నుంచి శవాలను, క్షతగాత్రులను బయటకు తీసి శిగ్గావ్ ఆస్పత్రికి తరలించారు. ఇంటికి వస్తున్నామని చెప్పిన నవ దంపతులు కాటికి చేరారని తెలిసి ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆస్పత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ యశోద వంటగోడి పరిశీలించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తుకు గురవడం వల్లనే ఘోరం జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


