అమ్మ ఆరుబయట కూర్చొని బియ్యంలో రాళ్లు ఏరుతుంటే.. ఒక్కో నీటి బొట్టు పడుతున్న కుళాయి వద్ద చిట్టి పిచ్చుకలు ఎంత సందడి చేసేవో కదా!
అమ్మ చాటలో నుంచి నాలుగు బియ్యపు గింజలు అలా అరుగుపైన వేయగానే.. అవి వచ్చి పోటీ పడుతూ తినేవి. కడుపు నిండాక మళ్లీ మనింటి కూనల్లో కట్టుకున్న గూడులోకి వెళ్లిపోయేవి.
వాటినలా చూస్తుంటే తెలియని ఓ రకమైన అనుభూతి కలిగేది. ఆ ఆనందం మీకిప్పుడు కనిపిస్తోందా? ఎక్కడో దాక్కొని కుహు.. కుహు అని పాడే కోకిల స్వరాన్ని మనం మునుపటిలా ఆస్వాదిస్తున్నామా?
కిచ్.. కిచ్' అని సౌండ్ చేస్తూ తల్లి చుట్టూనే తిరిగే బుజ్జి కోడిపిల్లలు, చెట్టు ఆకుల్లో కలిసిపోయి పండ్లను కొరుక్కు తినే చిలుకలు, తన ముక్కుతో చెట్ల కొమ్మల్ని చెక్కే వడ్రంగి పిట్టలు, గోలచేసే కాకులు, నాట్యం చేసే నెమళ్లు మునుపటిలా తారసపడుతున్నాయా?
ఆ ఆవేదన నుంచి వచ్చిందే 'జాతీయ పక్షుల దినోత్సవం'. అంతరించిపోతున్న పక్షుల్ని కాపాడుకునేందుకు, వాటి ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 5న 'నేషనల్ బర్డ్ డే' నిర్వహిస్తాం.
అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, సెల్ టవర్లు పెరిగిపోవడం వంటి కారణాల వల్ల పిచ్చుకలు సహా చాలా పక్షులు కనుమరుగైపోతున్నాయి.
ఓ ఇరవై ఏళ్ల క్రితం మనం చూసిన చాలా పక్షులు నేటి తరానికి తెలియవు. ముఖ్యంగా మన భారతదేశంలో గద్దలు, రాబందులు, రామచిలుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.
ఎక్కడైనా బతకగలిగే ఓర్పు, నేర్పు ఉన్న జీవిగా గుర్తింపు పొందిన కాకులు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. ఉగాది సందేశాన్ని అందించే కోకిలమ్మను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వాగులు, చెరువుల్లోకి వలస వచ్చే పక్షులు కూడా తగ్గిపోతున్నాయి. అమెరికా, కెనడాల్లో 300 కోట్ల పక్షులు మాయమైపోయాయట. రోజుకురోజుకూ ఈ ముప్పు మరింత ముంచుకొస్తోంది.
వీటిని కాపాడుకోకుంటే ఇవి త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉందని, వాటివల్ల మన జీవిన విధానం కూడా ప్రభావితమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
అందుకే కనుమరుగవుతున్న ఈ పక్షుల మనుగడ కోసం మన వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.