WPL: మరోసారి కప్ ఎత్తుకుపోయిన RCB.. స్మృతికి ఫిదా అయిన 'కోహ్లీ'..!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు మరోసారి ఉమెన్ ప్రీమియర్ లీగ్ కప్ ఎగరేసుకొని పోయింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడ్డ ఆర్సీబీ.. ప్రత్యర్థి విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి సునాయస విజయం సాధించింది. తద్వారా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. WPL-2026 సీజన్లో ఆర్సీబీ ఆరంభం నుంచే వరుస విజయాలు సాధించింది. ఐదు మ్యాచ్లు గెలిచి మిగిలిన జట్ల కంటే ముందుగా ప్లే ఆఫ్స్ చేరింది.
వడోదరలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ ఆర్సీబీ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు లిజెల్లి లీ (37), షఫాలీ వర్మ (20) కాస్త మెరుగ్గా ఆడినా, లారా వొల్వర్ట్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ (37 బంతుల్లో 57)తో మెరవగా.. చినెల్లి హెన్రీ (15 బంతుల్లో 35 నాటౌట్) ఫినిషింగ్ అదరగొట్టింది. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి 203 పరుగులు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో సయాలీ సత్గరే, అరుంధతి రెడ్డి, నదైన్ డిక్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు.
ఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ 9 పరుగులకే పెవిలియన్ చేరింది. అయినా స్మృతి వెనక్కి చూడలేదు. వన్డౌన్ బ్యాటర్ జార్జియా వోల్తో కలిసి స్కోరు బోర్డును ఉరుకులు, పరుగులు పెట్టించింది. స్మృతి (Smrithi Mandhana) 41 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు సాధించింది. వోల్ 54 బంతుల్లో 79 పరుగులు చేసింది. స్మృతి- వోల్ వేసిన బలమైన పునాదిపై నదైన్ డిక్లెర్క్ (5 బంతుల్లో 7), రాధా యాదవ్ (5 బంతుల్లో 12) అజేయంగా నిలిచి పని పూర్తి చేశారు. 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆరు వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. వరుసగా ఢిల్లీ నాలుగు సార్లు ఫైనల్కి వచ్చినా కానీ కప్ మాత్రం గెలవలేకపోయింది.
విరాట్ హ్యాట్సాఫ్..!
RCB మహిళా జట్టుకు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Kohli) శుభాకాంక్షలు తెలిపాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రెండోసారి చాంపియన్స్గా నిలిచి ఆర్సీబీ కుటుంబానికి గర్వకారణమయ్యారంటూ స్మృతి మంధాన సేనను కొనియాడాడు. ఇదొక అద్భుత విజయమని.. ట్రోఫీని ముద్దాడేందుకు ఆర్సీబీ మహిళా జట్టుకు పూర్తి అర్హత ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కామెంట్ చేస్తూ ‘‘మరోసారి చాంపియన్స్గా నిలిచారు. ఆర్సీబీ విజయ పతకాన్ని ఎగురవేస్తూనే ఉండాలి. జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. ముఖ్యంగా స్మృతి.. నీకు, జట్టుకు, ఆర్సీబీ యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఇదొక అద్భుతమైన విజయం. ఇందుకు మీరు అర్హులు. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. మన అభిమానులు పంచే ప్రేమను ఎంజాయ్ చేయండి’’ అని ప్రశంసలు కురిపించాడు.


