New Pensions from April: ఏప్రిల్ నుంచి తెలంగాణలో 4 వేల పెన్షన్, మహిళలకు 2500..!

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పార్టీలు వినూత్న ప్రచారాలు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా 4 వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు.. కానీ 800 రోజులైనా అమలు చేయలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదని, రైతులు పొలాలు దున్నుకొని, నాట్లుకూడా వేశారని, అయినా ఈ సీజన్ రైతు బంధు ఇప్పటికీ రాలేదని విమర్శిస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా వేస్తామని చెప్పారు సీఎం రేవంత్రెడ్డి.
అయితే తాజాగా ఏఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పింఛన్ల పెంపు, మహిళలకు 2500 పథకాల గురించి గద్వాల జిల్లా ఐజలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన, మార్చి తర్వాత పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని, మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 2500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి చక్కదిద్దుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ రెండు పథకాలే పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ స్కీం అమలు చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తు పెన్షన్లు, మహిళలకు రూ.2500 హామీని అమలు చేస్తామని సంపత్కుమార్ హామీ ఇచ్చారు.


