కాంగ్రెస్ పార్టీ జెండాలతో పెళ్లికి ర్యాలీగా వెళ్లాలని అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూతురు పట్టుబట్టింది.

కాంగ్రెస్ పార్టీ జెండాలతో పెళ్లికి ర్యాలీగా వెళ్లాలని అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూతురు పట్టుబట్టింది. ఇందుకు నిరాకరించిన పెళ్ళికొడుకు.. పెళ్లి ఆగిపోవడంతో మాజీ ఎమ్మెల్యే భార్యకు తీవ్ర గుండెపోటు వచ్చింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఎంబీబీఎస్(MBBS) చదివింది.. ఆమెకు గుజరాత్ క్యాడర్లో పనిచేస్తున్న గుంటూరు యువ ఐపీఎస్ అధికారితో వివాహం నిశ్చయించారు. నిన్న సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో పెళ్లి ఉండగా, పెళ్లి కూతురు కాంగ్రెస్ జెండాలతో ఊరేగింపుగా వెళ్లాలని పట్టుబట్టింది.. దీనికి ఐపీఎస్ బంధువులు వద్దని వారించారు. పెళ్లి కొడుకు ఐపీఎస్ అధికారి కావడంతో ఇలా పార్టీ జెండాలు పట్టుకొస్తే ఇబ్బంది అవుతుందని దీనికి నిరాకరించాడు. దీంతో పెళ్లి ఆగిపోగా పెళ్లి కూతురు తల్లికి తీవ్ర గుండెపోటు వచ్చింది. ముందు పెళ్లి కూతురు తరపు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు ససేమిరా అన్నారు.. దీంతో పెళ్లి కొడుకు తరపు వారిని బుజ్జగించారు. ఏడు గంటల పాటు చర్చి పెద్దలు, పాస్టర్లు బుజ్జగించి ఐపీఎస్ అధికారిని వివాహానికి ఒప్పించారు. దీంతో నిన్న జరగాల్సిన పెళ్లి ఈరోజు ఉదయం జరిగింది. మాజీ ఎమ్మెల్యే భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం
