Harish Rao: సుమన్‌ అరెస్టుపై హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం..! కాంగ్రెస్‌ తొత్తులుగా ఉన్న పోలీసులకు వార్నింగ్..!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ సర్కార్.. కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదని హరీష్‌రావు హెచ్చరించారు.

క్యాతన్‌పల్లిలో దొడ్డిదారిన అధికారం లాక్కునేందుకు.. మంత్రి వివేక్, పోలీసుల ముందే మా దళిత, గిరిజన మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం ఆక్షేపణీయమని, రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి పట్టపగలే ప్రజా తీర్పును కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులకు కౌంట్ డౌన్ స్టార్ట్. రేపు మళ్ళీ బీఆర్ఎస్ రాగానే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు.

ఉద్యమకారుడు బాల్క సుమన్‌పై ప్రభుత్వ కక్ష సాధింపు.. అక్రమంగా అరెస్ట్ చేసి 200 కి.మీ దూరంలోని ఆదిలాబాద్ జైలుకు తరలించడం దుర్మార్గం. బీజేపీ నాయకులు పోలీసులను బూతులు తిట్టినా అరెస్టులు ఉండవు.. కానీ ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుల పైనే అక్రమ కేసులా? అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ '' తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తో పాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నప్పటికీ.. వాళ్లను అక్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గం. క్యాతన్‌పల్లిలోని 22 స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. బీఆర్ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ గారు శిరసావహించాల్సింది పోయి, ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదు. కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారు. అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్ గారు చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, నోటితో చెప్పలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలపై చేయి చేసుకున్నారు. మహిళలపై దాడి జరుగుతున్నప్పుడు వివేక్ గారు మంత్రి హోదాలో అక్కడే ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడం, కోరం ఉన్నా ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం శోచనీయం. క్యాతన్‌పల్లి మహిళా కౌన్సిలర్ల తరపున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం కంప్లైంట్ తీసుకోలేదు. కౌన్సిల్‌కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? రాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టారు.

బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలుగా ఉండి కూడా లోపలికి పంపించకుండా.. కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాపై దాడి చేశారు. పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు స్టేషన్‌కు వచ్చి మరీ కొడుతున్నారు. ఈ రకమైన దాడులు మంచివి కావు. పోలీస్ కవాతు ప్రజలకు రక్షణ కల్పించాలి. Vప్రజల్లో విశ్వాసం నింపాలి. కానీ జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమంగల్, క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ నాయకులను, కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడానికే పోలీసులు కవాతు చేశారు. ఇబ్రహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జనగామలో ఓటింగ్ కోసం మా కౌన్సిలర్ చేతి పైకెత్తితే.. వెనుక నుండి కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారు. అందులో దళిత మహిళ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గం. ఒక ఎంపీ అన్యాయంగా రెండోసారి తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగే మున్సిపాలిటీలు గెలిచింది. మేము ఇప్పుడు దాదాపు 800 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నాం. అప్పుడు మేం ఏనాడూ ఇలా చేయలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. దొడ్డిదారిన పదవులు దక్కించుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు.. మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. కాంగ్రెస్, బీజేపీల మైత్రి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ ఎంపీ పోలీసులను పట్టుకుని అడ్డగోలుగా బూతులు తిట్టినా ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదు.

రాహుల్ గాంధీ గారు ఈరోజు ఢిల్లీలో తెలంగాణ క్యాబినెట్‌తో రివ్యూ చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి పోయినా చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే? తెలంగాణలో పట్టపగలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరు? రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరు? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, క్యాతన్‌పల్లి ఇన్సిడెంట్ పైన గవర్నర్ గారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి. పోలీసు అధికారులకు మేము చెప్పేదొకటే.. అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒకే తీరుగా ఉండవు. కాలం మారుతుంది, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. పోస్టింగ్‌ల కోసం నాయకుల చెప్పుచేతల్లో పనిచేయకూడదు. చట్టాన్ని అతిక్రమించి, పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు తీవ్ర మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు. మీరు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు'' అని హరీష్‌రావు తీవ్రంగా హెచ్చరించారు.

Updated On
ehatv

ehatv

Next Story