మళ్లీ జన్మంటూ ఉంటే నీకు కొడుకులా పుడతా నాన్నా..!

ఓ మహిళ అత్తింటి వేధింపులు, భర్త వివాహేతర సంబంధాలు తట్టుకోలేకపోయింది. గత కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. అత్తారింటికి పోవాలని పుట్టింటి నుంచి ఒత్తిడులు, అటు భర్తతో ఉండలేక, ఇటు ఇరుగుపొరుగు వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఓ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఇద్దరు పసిపాపలను చంపి, ఆతను కూడా ఆత్మహత్య చేసుకుంది. నాన్నా నేను ఆడపిల్లగా పుట్టి నీకు దుఃఖం మిగిల్చాను, మళ్లీ జన్మలో నీకు కొడుకులాగా పుడతా, మా ముగ్గురు మృతదేహాలను బాయిదగ్గర ఉన్న రేగుచెట్టు కింద ఒకే దగ్గర పూడ్చి పెట్టు నాన్నా, నిన్ను రోజూ చూడాలి నాన్నా, నేను చనిపోతే ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారని వారిని కూడా తీసుకెళ్తున్నా నాన్నా అంటూ ఆ తల్లి రాసిన సూసైడ్ లేఖ చూసి కంటనీరు పెట్టనివారెవరూ లేరు. ముగ్గురి మృత దేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చలించిపోయారు. గ్రామమంతా రోదనలతో మిన్నంటింది. భర్త మహేష్, అత్త మామలు సత్తమ్మ, నర్సింహను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యాదాద్రి జిల్లా గొల్లగూడెంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
మహేష్ యాదవ్ ఐశ్వర్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, వివాహేతర సంబంధాలు కొనసాగించడమే ఈ ఘోరానికి కారణమని ఐశ్వర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తరచుగా గొడవలు జరుగుతుండటంతో గత పదినెలలుగా ఆమె భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది. మహేష్ గత పది రోజులుగా ఫోన్లు చేస్తూ ఇంటికి రావాలని కలసి ఉందామని చెప్పడంతో సోమవారం ఐశ్వర్యను పెదనాన్న, పెద్దమ్మ భర్త ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లారు. అయితే అదే రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం అత్త లేచి చూడగా ఐశ్యర్య పిల్లలను చంపి, ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పంచనామా చేపట్టి, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తన భర్త, అత్త మామలను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐశ్వర్య సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు. భర్త అత్తమామలు తనను, పిల్లలను ఏనాడూ సరిగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారనే భయంతో పిల్లల్ని కూడా తీసుకెళుతున్నానని, తనను తల్లిదండ్రులు క్షమించాలని కోరిందన్నారు. తాను, తన పిల్లల చావుకు నా భర్త మేకల మహేష్, అత్త మామలు మేకల నర్సింహా, మేకల సత్తమ్మలే కారణమని, వారికి జీవితాంతం శిక్ష పడేలా చూడాలని ఆమె సూసైడ్ లేఖలో కోరింది.


