తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో జూలై 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రెడ్ అలర్ట్ ఈరోజు వ‌ర‌కూ మాత్రమే ఉంటుంది. రేపటికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్, ఎల్లుండికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

హైదరాబాద్‌లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. వాతావరణ శాఖ నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. ఇది రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వర్తిస్తుంది.

హైదరాబాద్ విషయానికొస్తే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నగరంలో జూలై 22 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ జిల్లాలో అత్యధికంగా 207.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిశాయి. మారేడ్‌పల్లిలో అత్యధికంగా 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

మొత్తం తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రత భద్రాద్రి కొత్తగూడెంలో 25.2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గగా.. హైదరాబాద్ షేక్‌పేటలో 29.2 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story