సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క సోమ‌వారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క సోమ‌వారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ సృజన, సిబ్బంది పాల్గొన్నారు. శాఖలో జరుగుతున్న పనుల పురోగతిపై, అమలవుతున్న పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమీక్ష సందర్భంగా మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గుడ్లు, పాలు, పప్పు, మంచినూనె, స్నాక్స్, బాలమృతం సరఫరాపై సమీక్ష జరిపారు. అధికారుల నివేదిక ప్రకారం పాలు మినహా మిగిలిన వస్తువులన్నీ 98 శాతం పైగా సరఫరా అవుతుండగా, పాలు మాత్రం గత నెలలో 58 శాతం మాత్రమే సరఫరా అయ్యాయని తెలిపారు. పాల సరఫరా లోపంపై మంత్రి సీరియస్‌గా స్పందించి, పాలతో సహా ఎక్కడా ఫుడ్ గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. గుడ్ల సరఫరా విషయంలో మంత్రి సీతక్క అధికారుల‌కు కీల‌క ఆదేశాలు ఇచ్చారు. 5 జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు టెండర్లు ఖరారు చేసినట్లు అధికారులు తెలియజేశారు. గుడ్ల సరఫరాలో కలర్ కోడింగ్ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేస్తూ, ప్రతి పది రోజులకు ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. 1261 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి లక్ష్యాన్ని నిర్ణయించగా, 1181 కేంద్రాలకు స్థలాలు గుర్తించామని అధికారులు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి నవంబర్ 19న మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జయంతి లోపు భవనాల నిర్మాణం పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే నిర్మాణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో బల్లలు, సిబ్బంది యూనిఫాంలు, చిన్నారుల యూనిఫాంలు తక్షణం సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రత అంశంపై కూడా మంత్రి దృష్టి సారించారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్చంద సంస్థలతో మహిళా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.ఈ నెల 19,20 తేదిల్లో మ‌హిళా భ‌ద్ర‌త పై చ‌ర్చించేందుకు రౌండ్ టెబుల్, మ‌హిళా స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశాలు జారి చేశారు మంత్రి సీత‌క్క‌.

ehatv

ehatv

Next Story