Sub-registration offices: వసూళ్లకు అడ్డగా సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయాలు..!

తెలంగాణలో సబ్-రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వసూళ్లకు అడ్డాలుగా మారాయి. అవినీతికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా.. చేయి తడిపితేనే కానీ పక్కాగా పని అవుతుంది. కొందరు డాక్యుమెంట్ రైటర్లే వసూళ్ల రాయుళ్లుగా చలామణి అవుతున్నారు. అధికారుల వాటా కలుపుకునే డాక్యుమెంట్ తయారీ ఖర్చుల కింద వసూలు చేస్తున్నారు.రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో తరచూ లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. రిజిస్ట్రేషన్లు చేసి అందిన మేరకు దోచుకుంటున్నారు. ఆస్తి విలువను బట్టి కనీసం రూ.2 వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్కు అనుకూలంగా పత్రాల తయారీకయ్యే ఖర్చులతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ముట్టజెప్పాల్సిన సొమ్మును డాక్యుమెంట్ రైటర్లే వసూలు చేసుకుంటున్నారు. లింకు డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం, సాక్షులు అందుబాటులో లేకపోతే సర్దుబాటు చేయడం, రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి చూపించేందుకు ముక్కు పిండి అదనంగా గుంజుతున్నారు. సాయంత్రానికి ఏ డాక్యుమెంట్ రైటర్ నుంచి ఎన్ని డాక్యుమెంట్లు వచ్చాయో తనిఖీలు చేసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ అధికారులు. తదనుగుణంగా వసూళ్ల దందాలకు తెరలేపారు.


