Man absconded : ATMలో పెట్టే డబ్బు ట్రంక్ పెట్టెతో పరారీ..! ప్రియురాలికి వీడియో కాల్..! రోజుకో రూ.2 లక్షలతో జల్సాలు..!
Man absconded : ATMలో పెట్టే డబ్బు ట్రంక్ పెట్టెతో పరారీ..! ప్రియురాలికి వీడియో కాల్..! రోజుకో రూ.2 లక్షలతో జల్సాలు..!

ఏటీఎంలో పెట్టాల్సిన డబ్బులను ట్రంక్ పెట్టెతో పరారైన వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గం బొమ్మనహాల్కు చెందిన అజిత్ కుమార్ అలియాస్ శివ సికింద్రాబాద్లో నివాసం ఉంటూ 6 నెలల క్రితం సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్లో డ్రైవర్గా చేరాడు. ఆ సంస్థ యాక్సిస్ బ్యాంకుల ఏటీఎంలలో క్యాష్ పెడుతుంది. ఈ నెల 12న గోపన్పల్లిలో డబ్బు పెట్టేందుకు చేరుకున్నారు. ఇతని వెంట కస్టోడియన్స్ రామకృష్ణ, మాలిక్లు ఏటీఎం లోపలికి వెళ్లారు. సెక్యూరిటీ గార్డు బాత్రూం వెళ్లారు, ఇదే అనువైన సమయం అనుకున్న అజిత్ కుమార్ డబ్బుల పెట్టెలున్న వాహనం తీసుకొని పారిపోయాడు. బయటకు వచ్చిన సిబ్బంది ఫోన్ చేసి అడగగా పక్కనే ఉన్నానంటూ టీ తాగుతున్నానని నమ్మించాడు. ఎంత సమయం గడిచినా రాకపోయేసరికి అజిత్ డబ్బులున్న వాహనంతో పరారైనట్లు భావించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ట్రంక్ పెట్టెను తీసుకొని వాహనాన్ని తెల్లాపూర్ గద్దర్ క్రాస్ రోడ్డులో వదిలి అజిత్ ఆటోలో పారిపోయాడు. లాడ్జీలో పెట్టెను యాక్సెల్ బ్లేడ్తో కోసి జొమాటో బ్యాగ్లో రూ. 57 లక్షల నగదును సర్దాడు. మియాపూర్లో పుణె వెళ్లే బస్సు ఎక్కాడు. డ్రైవర్ బ్యాగ్ చెక్ చేయాలనడంతో బస్సు దిగి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడి నుంచి మరో బస్సులో అనంతపురం వెళ్లాడు. అక్కడి నుంచి విశాఖలో ఉండే తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. అలాగే ప్రియురాలికి ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు, యువతిని ఆరా తీశారు. దీంతో పోలీసులు తన కోసం గాలిస్తున్నారని అనంతపురం నుంచి బళ్లారి, హోస్పేట్, బెంగళూరుకు వెళ్లాడు. అక్కడి నుంచి పుణె, ముంబై వెళ్లాడు. ఖరీదైన మద్యం తాగుతూ హోటల్స్లో జల్సాలు చేస్తూ గడిపాడు. 11 రోజుల పాటు వివిధ నగరాలు తిరుగుతూ రోజుకు రూ.2 లక్షల చొప్పున రూ.22 లక్షలు ఖర్చు చేశాడు. అజిత్కుమార్ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులకు శంషాబాద్ దగ్గర బ్యాగ్తో కనపడ్డాడు. వెంటనే అరెస్ట్ చేసి రూ.34,90,000 స్వాధీనం చేసుకున్నారు. అయితే నాలుగు నెలలుగా తనకు జీతం ఇవ్వకపోవడంతో ఎలాగైనా డబ్బుతో ఉడాయించాలనుకున్నాడు.


