YNR Analysis : కూటమి దుష్ప్రచారం తేల్చేసిన సీబీఐ.!
సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖపట్నం రేవుకు 25 వేల టన్నుల డ్రగ్స్ చేరుకుంది.

సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విశాఖపట్నం రేవుకు 25 వేల టన్నుల డ్రగ్స్ చేరుకుంది. పెద్ద మొత్తంలో వచ్చిన ఈ డ్రగ్స్ ను సీబీఐ వారు వచ్చి పట్టుకున్నారు. ఈ సంఘటన జరగగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. తనఖీలు, సోదాలు చేయవద్దంటూ వారిని అక్కడి నుంచి పంపించేశారు. పొద్దున్నే వార్తాపత్రికలు చదివినవారికి ఇదే కనిపించింది. తెలుగుదేశంపార్టీ ప్రధాన మీడియా రాసింది ఇదే! డ్రగ్స్ అక్రమ రవాణాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు విశాఖపట్నం రేవును కేంద్రంగా చేసుకున్నారని, విదేశాల నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ను విశాఖకు తెప్పించారని, డ్రగ్స్ పట్టుబడటంతో వైఎస్ఆర్ నాయకులు ఆగమేఘాల మీద అక్కడికి వెళ్లి వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ మీడియా రాసుకొచ్చింది. పోలీసులను కూడా అడ్డుకున్నారని, వారిని కొట్టే ప్రయత్నం చేశారని ఇలా చాలా చాలా ఆ మీడియా రాసింది. ఇదంతా చదివినవారు నిజమే కాబోలునని అనుకున్నారు. అంత బాగా కథనాన్ని వండింది ఆ మీడియా! 25 వేల టన్నుల డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో చెలామణి అయితే ఏపీ భవిష్యత్తు ఏమవుతుందన్న భయం ఆవరించింది. ఎన్నికల సమయం కాబట్టి తెలుగుదేశంపార్టీ దీన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంది. అప్పటి జగన్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించింది. వైసీపీ నాయకులే డ్రగ్స్ను విదేశాల నుంచి తీసుకొచ్చారని తెలుగుదేశంపార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు ప్రకటించాయి. ఇది జరిగింది ఆరు నెలల కిందటే కాబట్టి, ఆనాటి పత్రికలు తిరగేస్తే అప్పుడు మీడియా ఏం రాసిందో తెలిసిపోతుంది. వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ విశాఖలో పట్టుబడిందని, ఎన్నికల సమయం కాబట్టి పోర్టులు కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటాయి కాబట్టి డ్రగ్స్ దొరికాయని, ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎన్ని జరిగి ఉంటాయోనని గుండెలు బాదుకుంది మీడియా. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ డ్రగ్స్ తీసుకొచ్చిన కంపెనీ బీజేపీ రాష్ట్ర నాయకురాలు పురంధేశ్వరి బంధువులదంటూ ఆరోపించింది. అసలు అందులో ఏముందన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశంపార్టీకి క్లారిటీ ఉన్నా ఎన్నికల ప్రచారానికి పనికి వస్తుందని నిజాన్ని కప్పి ఉంచింది. కొంతమంది టీడీపీ మీడియాలోని ప్రముఖులు తమ మేథావితనాన్ని చాటుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం డ్రగ్స్ తెప్పించారని, ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన సొమ్ముతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దిగబోతున్నదని స్టేట్మెంట్లు ఇచ్చారు. వారందరికీ సీబీఐ షాకిచ్చింది. వచ్చింది డ్రగ్స్ కాదని, ఈస్ట్ అని తేల్చేసింది. అప్పుడు తప్పుడు ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ఏం చేస్తారు?
