Car Deaths: కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలోకి..!

Car Deaths: కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలోకి..!

By :  ehatv
Update: 2025-05-19 05:27 GMT

విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుతూ పాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక గిలగిలలాడి ప్రాణం విడిచారు. విజయనగరం రూరల్‌ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి గ్రామం, బీసీ కాలనీలో ఆదివారం ఓ పెళ్లివేడుక జరిగింది. అయితే చిన్నారుల తల్లిదండ్రులు పెళ్లి హడావిడిలో ఉన్నారు. తల్లిదండ్రులను విడిచి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకటో తరగతి చదువుతున్న కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), 2వ తరగతి చదువుతున్న బూర్లె జాస్రిత (8), 3వ తరగతి చదువుతున్న పండి ఉదయ్‌ (7) సమీపంలోని నీళ్ల ట్యాంక్‌ వద్ద ఆడుకోవడానికి వచ్చారు. అక్కడే ఆగి ఉన్న ఓ కారులోకి ఎక్కారు. అకస్మాత్తుగా డోర్‌ లాక్‌ కావడంతో లోపల చిక్కుకుపోయారు. కేకలు వేసినా బయటకు వినపడక పోవడంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సందడిలో ఉన్న తల్లిదండ్రులు, ఎంతకూ తమ పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కారులో పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్నారన్న భావనతో 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుల్లో చారులత, జాస్రిత అక్కచెల్లెళ్లు. ఇద్దరు కూతుర్లు మృతిచెందడంతో తండ్రి ఆనంద్‌ గుండెలవిసేలా విలపించారు. ఈ సంఘటనలో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది.

Tags:    

Similar News