AP: ఏపీలో టీడీపీకి షాక్.. ముఖ్యనేత పార్టీకి రాజీనామా..!
AP: ఏపీలో టీడీపీకి షాక్.. ముఖ్యనేత పార్టీకి రాజీనామా..!
అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తన రాజీనామా లేఖను అందజేశారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజీనామాకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు బహిర్గతం కాలేదు, కానీ పార్టీలో అసంతృప్తి, చంద్రబాబు నాయకత్వంపై వ్యతిరేకత లేదా రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. రాజంపేటలో టీడీపీకి బలమైన నాయకుడిగా ఉన్న సుగవాసి రాజీనామా పార్టీకి గట్టి షాక్ అనే చెప్పవచ్చు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తన రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరతారు లేదా స్వతంత్రంగా కొనసాగుతారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. కొన్ని వర్గాలు ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నాయి. తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని అన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు.