Pcc Cheif: పనితీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ క్లాస్..!
Pcc Cheif: పనితీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ క్లాస్..!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సమీక్ష సమావేశాల్లో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని, దీని వల్ల పార్టీ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని మహేష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకొని, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మెరుగైన ఫలితాలు సాధించాలని, లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంలో పునరాలోచన ఉంటుందని హెచ్చరించారు.ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేనివని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఇది పార్టీలోని కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయం కోసం కీలకమని పేర్కొన్నారు. కొందరు నాయకుల నుంచి మల్లు రవిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ, పట్టణ స్థాయిలో బలోపేతం చేయడం, సామాజిక న్యాయం కోసం కులగణన వంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నారు.